తెలంగాణ బడ్జెట్‌ 2023-24 || Telangana budget - 2023-24 in Telugu || Telangana Budget in Telugu || Gk in Telugu

Telangana budget -2023 in telugu

 తెలంగాణ బడ్జెట్‌ 2023-24

Telangana Budget 2023-24 in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2023-24 ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. వరసగా 4వ సారి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నీటిపారుదలకు అధిక నిధులు కేటాయిస్తు, హరితహారానికి ప్రాధాన్యతనిస్తు, వ్యవసాయ రంగానికి ఊతమిస్తు, పారిశ్రామిక రంగం ముందుకు తీసుకెళ్తు మంత్రి హరీష్‌రావు 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది లక్ష్యంగా 60 వేల కోట్లు కేటాయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారుల కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం గత సంవత్సరం కన్న అధిక నిధులు కేటాయించింది. రైతుబందు, ఋణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు భారీ నిధులు కేటాయించింది. పేదల గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1100 కుటుంబాలు లబ్దిపొందేలా 17,700 కోట్లను కేటాయించింది. ఖాళీ స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు 12 వేల కోట్లను కేటాయించింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పథకాలకు 4,844 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృధ్ది నిధి కోసం 10 వేల 348 కోట్లు కేటాయించింది.

మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి వ్యవసాయ శాఖకు 26,831 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 12,161 కోట్లు, పరిశ్రమల శాఖకు 4037 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కొరకు 2,131 కోట్లు, విద్యాశాఖకు 19,093 కోట్లు, హోంశాఖకు 9599 కోట్లు, రోడ్లు మరియు భవనాలకు 2,500 కోట్లు, పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్దికి 31,426 కోట్లు కేటాయించినారు. 

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు :

  • దేశంలో వ్యవసాయ వృద్ది రేటు 4% ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వృద్దిరేటు 7.4 శాతంగా ఉంది. ఇది భారత వృద్ది రేటు కన్న 3.4% ఎక్కువగా ఉంది. 
  • 11000 కోట్లతో వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణం, 
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నిర్మల్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్‌జిల్లాలలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. 
  • ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు 
  • 2వేల బెడ్ల సామర్థ్యంతో సూపర్‌స్పెషాలిటి వైద్య సేవలు 
  • హరితహారం కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ హైద్రాబాద్‌ నగరాన్ని ట్రిసిటి గా వరుసగా రెండుసార్లు గుర్తించింది. భారతదేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 
  • నీతిఆయోగ్‌ వెలువరిచే సుస్థిర అభివృద్ది లక్ష్యాల నివేదికలో, దేశంలో పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది. 
  • దక్షిణ కోరియాలోని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హర్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ వరల్డ్‌ గ్రీన్‌సిటి అవార్డు-2022ను హైద్రాబాద్‌ నగరానికి అందించింది. 
  • తెలంగాణ తలసరి ఆదాయం 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలుగా ఉంది. ఇది 2022-23 సంవత్సరానికి గాను 3,17,115 రూపాయలు ఉండవచ్చని అంచనా వేసింది. ఇది జాతీయ సగటు తలసరిఆదాయం 1,70,620 రూపాయల కంటే 86 శాతం ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం కన్న తెలంగాణ తలసరి ఆదాయం 1,46,495 రూపాయలు ఎక్కువగా ఉంది. 
  • 2022-23 సర్వే ప్రకారం రాష్ట్ర జిఎస్డీపి ప్రస్తుత ధరల ప్రకారం 13.27 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21 తో పోల్చితే ఇది 15.4% వృద్దిని నమోదు చేసింది. 
  • 2021-22 లో రాష్ట్ర వ్యవసాయ రంగం , దాని అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు(జీవీఏ) తో పోల్చితే 2022-23 లో 11.9% వృద్ది రేటు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర జనాభాలో 45.8% మందికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పించింది. 
  • 2022-23 లో పారిశ్రామిక రంగం జోడించిన జీవిఏ వృద్దిరేటు 10.5% నమోదైంది. 2021-22 లో 17.9% వృద్దిరేటు నమోదు చేసింది. సేవారంగం 2022-23 లో జీవిఏ 17.5 % నమోదైంది. 
  • 8 సంవత్సరాలలో ఐటి, పరిశ్రమలకు 3.31 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 22.36 లక్షల ఉద్యోగాలు లభించాయి.
  • తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో తర్వాతి స్థానంలో హైద్రాబాద్‌ ఉంది. 
  • మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలోని  612 మండలాలలో మొత్తం 3.75 కోట్ల జనాభా నివసిస్తున్నారు. దీనిప్రకారం ఒక్కో మండల సగటు జనాభా 61,366 గా ఉంది. 
  • మొబైల్‌ పోన్ల కనెక్షన్‌ల వినియోగ సాంద్రతలో తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. దేశంలో ప్రతి 100 మందికి సగటున 83 కనెక్షన్‌లు ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 105 ఉన్నాయి. 
  • ధరణి పోర్టల్‌ ద్వారా ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌-మ్యూటేషన్‌ పూర్తికి 47 నిమిషాలు సమయం పడుతుంది. 2020 నవంబర్‌ నుండి 2023 జనవరి వరకు 23.20 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. 
  • రానున్న 5 సంవత్సరాలలో 70 పారిశ్రామిక వాడలు ఏర్పాటు
  • 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు

➠ దళిత గిరిజనులకు భారీ కేటాయింపులు :

దళిత గిరిజనుల అభివృద్ది కోసం రాష్ట్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక అభివృద్ది నిధి (ఎస్‌ఢఎఫ్‌) చట్టానికి 2023 బడ్జెల్‌లో ప్రభుత్వం అధిక నిధులను కేటాయించినది. 2023-24 బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఏకంగా 51,983 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక నిధి కోసం 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధి కింద 15,232 కోట్లు కేటాయించింది. దళితబంధు ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి 17,700 కోట్లు పంపిణీ చేయనుంది. 

➠ పరిశ్రమలకు ఊతం :

పారిశ్రామికాభివృద్ది ప్రోత్సాహకాలకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామిక రంగానికి 2023-2024 తెలంగాణ బడ్జెట్‌లో 4,037 కోట్లు మంజూరి చేశారు. నిర్వహణ వ్యయం కింద 254.77 కోట్లు, ప్రగతి కొరకు మరియు వివిధ అవసరాలకు 2,235.29 కోట్లు కేటాయించినారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ది నిధి నుండి 834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ది నిధి నుండి 717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అధిక ప్రాధాన్యతనిస్తు 2,937.20 కోట్లు కేటాయించారు. విద్యుత్‌ సబ్సిడీకి 316.39 కోట్లు, చిన్న,సూక్ష్మ,మద్యతరహ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ 266.20 కోట్లు కేటాయించారు. రానున్న 5 సంవత్సరాలలో 70 పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయన్నున్నట్లు తెలిపింది. టిఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు 22,110 యూనిట్లకు అనుమతులు ఇచ్చారు. 8 సంవత్సరాలలో ఐటి, పరిశ్రమలకు 3.31 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 22.36 లక్షల ఉద్యోగాలు లభించాయి. 

➠ కొత్తగా ప్రవేశపెట్టిన నేతన్న భీమాకు 50 కోట్లు :

నేత కార్మికుల కొరకు నూతనంగా ఏర్పాటు చేసిన నేతన్న భీమా తెలంగాణ బడ్జెట్‌ 2023-24 లో 50 కోట్లను కేటాయించారు. పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ది కోసం 2 కోట్ల చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టిఎస్‌ఎండిసీ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు 120 కోట్లు కేటాయించారు. 

➠ వ్యవసాయ రంగం :

తెలంగాణ బడ్జెట్‌ 2023-24 లో వ్యవసాయ రంగానికి 26,831 కోట్లను కేటాయించారు. ఈ మొత్త కేటాయింపులలో అధిక భాగం రైతుబంధు, రైతుభీమా, రైతుఋణ మాఫీ కొరకు వెచ్చించనున్నారు. ఇందులో రైతుఋణ మాఫి కొరకు 6,385 కోట్లను వెచ్చించనుంది. వ్యవసాయ రంగానికి కేటాయించిన దానిలో నుండి 1000 కోట్లను ఆయిల్‌ ఫామ్‌ కొరకు ఖర్చు చేయనుంది. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది దాదాపు 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు కొరకు 1000 కోట్లను కేటాయించింది. 

ఇందులో వ్యవసాయ యాంత్రీయకరణకు 377.35 కోట్లు, రైతులకు విత్తనాల సరఫరా కొరకు 39.25 కోట్లు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 75 కోట్లు, కొండా లక్ష్మణ్‌ బాపూరి ఉ  ద్యానవన విశ్వవిద్యాలయానికి 75 కోట్లు, రైతుబంధు సమితికి 3 కోట్లు, రైతువేధికలకు 12 కోట్లు, మార్కెట్‌ ఇంటర్వేన్షన్‌ ఫండ్‌కు 75.47 కోట్లు, వ్యవసాయ విస్తరణకు 1.99 కోట్లు, విత్తనాభివృద్దికి 25 కోట్లు కేటాయించనున్నారు. 

➠ పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలకు 31,426 కోట్లు :

తెలంగాణ బడ్జెట్‌ 2023-24 లో పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలకు 31,426 కోట్లు  కేటాయించారు. ఇందులో నుండి ఆసరా ఫించన్లు 12000 కోట్లు ఖర్చు చేయనున్నారు. జీతాలు మెయింటెనెన్స్‌ 9072 కోట్లు, పల్లె ప్రగతి 3360 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణ కు 2000 కోట్లు, జాతీయ ఉపాధి హామి మ్యాచింగ్‌ గ్రాంట్‌ కొరకు 1635 కోట్లు, మిషన్‌ భగీరథకు 1600 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

➠ వైద్య ఆరోగ్య శాఖకు 12,161 కోట్లు :

తెలంగాణ బడ్జెట్‌ 2023-24 లో వైద్య ఆరోగ్య శాఖకు 12,161 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నిర్మల్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్‌ జిల్లాలలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. 

➠ ముఖ్యమంత్రి ప్రత్యేక నిధికి 10,384 కోట్లు :

ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో అభివృద్ది పనుల కోసం కేటాయించే ప్రత్యేక అభివృద్ది నిధి (ఎస్‌డిఎఫ్‌) నే ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి అంటారు. సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్లే సమయంలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అభివృద్ది కార్యక్రమాలకు నిధులు కోరితే ఈ నిధినుండి కేటాయిస్తారు. 

➠ విద్యాశాఖకు 19,093 కోట్లు కేటాయింపు :

తెలంగాణ బడ్జెట్‌ 2023-24 లో విద్యాశాఖకు 19,093 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్‌ సింహభాగం ఉద్యోగుల వేతనాల చెల్లింపులకే వెళుతున్నాయి. మిగిలిన నిధులలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు కేటాయించనున్నారు. 

➠ అటవీశాఖకు 1471 కోట్లు :

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా రూపొందించిన నివేదిక -2021 ప్రకారం తెలంగాణ మొత్తం గ్రీన్‌కవర్‌ 7.70% పెరిగిందని తెలిపింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గఏవో), అర్భన్‌ డే పౌండేషన్‌ హైద్రాబాద్‌ ఆఫ్‌ ద వరల్డ్‌గా వరుసగా రెండుసార్లు గుర్తించింది. 2015 సంవత్సరంలో తెలంగాణలో 19,854 చ.కి అడవి ఉంటే అది 2021 నాటికి 20,582 చ.కి కు పెరిగింది. 2015`-2021 మద్య అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగింది. 

 పట్టణాలకు 11372 కోట్లు :

పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్‌ లో 11,372 కోట్లు కేటాయించారు. ఇందులో 3,906 కోట్లను నిర్వహణ పద్దుకొరకు కేటాయించారు. పట్టణ ప్రగతికి 1,474 కోట్లు ఇవ్వగా, పట్టణాభివృద్దికి 6వేల కోట్లు కేటాయించారు. స్వయం సహాయక సంఘాలకు  బ్యాంకుల ద్వారా తీసుకునే ఋణాల వడ్డీ చెల్లించేందుకు 651 కోట్లు , అమృత్‌ 2.0 కు గ్రాంట్‌ గా 259 కోట్లు, కరీంనగర్‌, వరంగల్‌ స్మార్ట్‌ సిటీలకు 341 కోట్లు  కేటాయించారు. ఎయిర్‌పోర్టు మెట్రోకు 500 కోట్లు, హైద్రాబాద్‌కు 3496 కోట్లు కేటాయించారు. 

➠ హోంశాఖ :

రాష్ట్ర బడ్జెట్‌లో హోంశాఖకు 9,599 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద 8727.72 కోట్లు, ప్రగతి పద్దు కింద 871.24 కోట్లు కేటాయించారు. రాష్ట్రం విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సర్వీస్‌ కు  32.14 కోట్లు, డిజిపి ఖాతా కింద నిర్వహణ పద్దు కొరకు 4789.30 కోట్లు కేటాయించారు. సైబర్‌ సెక్యురిటికి 35.50 కోట్లు, తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరోకు 8.50 కోట్లు కేటాయించారు. కొత్త పోలీసు భవనాలు, స్టేషన్ల నిర్మాణానికి 100 కోట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాలకు 100 కోట్లు కేటాయించారు. 

బడ్జెట్‌ ముఖచిత్రం :

మొత్తం బడ్జెట్‌ 2,90,396 కోట్లు
మొత్తం వ్యయం 2,90,396 కోట్లు
రెవెన్యూ రాబడి 2,16,566 కోట్లు
రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు
రెవెన్యూ మిగులు 4,882 కోట్లు
పన్ను రాబడి 1,31,029 కోట్లు
పన్నేతర రాబడి 22,808 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా 21,470 కోట్లు
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 41,259 కోట్లు
ఋణాలు 40,615 కోట్లు
మూలధన వసూల్లు 73,106 కోట్లు
మూలధన వ్యయం 37,525 కోట్లు
మొత్తం వసూళ్లు 2,89,672 కోట్లు
ద్రవ్యలోటు 38,235 కోట్లు


వివిధ శాఖలకు కేటాయించిన నిధులు :

వ్యవసాయ శాఖ 26,831 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ 12,161 కోట్లు
పరిశ్రమల శాఖ 4037 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం 2,131 కోట్లు
విద్యాశాఖ 19,093 కోట్లు
హోంశాఖ 9599 కోట్లు
రోడ్లు మరియు భవనాలు 2,500 కోట్లు
పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ది 31,426 కోట్లు
ఆర్థిక శాఖ 49,749 కోట్లు
పురపాలక శాఖ 11,372 కోట్లు
న్యాయ శాఖ 1,665 కోట్లు
పరిశ్రమల శాఖ 4,037 కోట్లు
నీటి పారుదల శాఖ 26,885 కోట్లు
రెవెన్యూ శాఖ 3,560 కోట్లు
కార్మిక, ఉపాధి శాఖ 542 కోట్లు
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి 10,384 కోట్లు
ప్రాజేక్టులు 26,885 కోట్లు
విద్యుత్‌ శాఖ 12,727 కోట్లు
రోడ్డు భవనాల శాఖ 22,260 కోట్లు
హరితహారం, అటవీశాఖకు 1471 కోట్లు
కళ్యాణలక్ష్మి 3,210 కోట్లు
మిషన్‌ భగీరథ 19,205 కోట్లు
ఆయిల్‌ ఫామ్‌ 1000 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ 3,117 కోట్లు
చెక్‌డ్యామ్‌లు 3,825 కోట్లు
షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ది 15,233 కోట్లు
దళితబంధు 17,700 కోట్లు
డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు 2007 కోట్లు
ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటి 500 కోట్లు
బిసి సంక్షేమం 6,229 కోట్లు
మైనార్టీ శాఖ 2,200 కోట్లు
హరితహారం 1,471 కోట్లు
కళ్యాణలక్ష్మి 3,210 కోట్లు
రైతుబంధు 17,700 కోట్లు
రైతుభీమా 1,589 కోట్లు
రైతుఋణమాఫీ 6,385 కోట్లు
ఆసరా పెన్షన్లు 12,000 కోట్లు
ప్రణాళిక సంఘం 11,495 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమం 100 కోట్ల కార్పస్‌ ఫంఢ్‌
విద్యుత్‌ సబ్సిడీ 12,000 కోట్లు
గిరిజన సంక్షేమం 3,965 కోట్లు
పశు, మత్య్స శాఖ 2,071 కోట్లు
రవాణా శాఖ 1,644 కోట్లు
పర్యావరణం, అడవులు, సైన్స్‌ 1,471 కోట్లు
సమాచార, కమ్యూనికేషన్స్‌ శాఖ 366 కోట్లు
శాసన వ్యవస్థ 168 కోట్లు
పట్టణ ప్రగతి 1,474 కోట్లు
హరితహారం, అటవీశాఖకు 1471 కోట్లు
కేసీఆర్‌ కిట్లు 200 కోట్లు
గిరిజన సంక్షేమ 3,965 కోట్లు
షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది కొరకు 21,022 కోట్లు
ఉన్నత విద్య 3,001 కోట్లు
పాఠశాల విద్య, సచివాలయం 16,902 కోట్లు
క్రీడలకు 135 కోట్లు



తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు 2023-24 బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్శంగా బడ్జెట్‌లో తరచూ వాడే పదాల గురించి తెలుసుకుందాం ..!

➠ బడ్జెట్‌ :

స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలియజేసే పట్టికనే బడ్జెట్‌గా భావించవచ్చు. ప్రజల నుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతుందో ఈ బడ్జెట్‌ ద్వారా తెలియజేస్తారు.

➠ మూలధన బడ్జెట్‌ :

మూలధన, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తో పాటు రెవెన్యూ బడ్జెట్‌ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. ప్రభుత్వాని వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబందించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి. 

➠ రెవెన్యూ పద్దు :

ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, ఋణచెల్లింపులు ఈ పద్దులోకి  వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి. 

➠ క్యాపిటల్‌ పద్దు (ప్రణాళిక వ్యయం) :

ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి. 

➠ సంచిత నిధి :

అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు ఋణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుండి ఖర్చు చేయడానికి పార్లమెంట్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు` రెవెన్యూ వ్యయం 2. మూలధన వసూళ్లు`మూలధన వ్యయం 

➠ ప్రభుత్వ ఖాతా :

సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. ఆర్‌బిఐ నుండి, పిఎఫ్‌ నుంచి తీసుకునే ఋణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. 

➠ రెవెన్యూ వసూళ్లు :

పన్నులు, సుంకాలు ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూల్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు, ఎక్సైజ్‌ డ్యూటీ, కార్పోరేట్‌ ట్యాక్స్‌, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే డబ్బంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు ఈ కేటగిరి కిందికి వస్తాయి. 

➠ రెవెన్యూ వ్యయం :

ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు. 

➠ రెవెన్యూలోటు :

ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయలోటు ఏర్పడుతుంది. దీనినే రెవెన్యూ లోటు అంటారు. అప్పులు, ఇతర మార్గాల ద్వారా ఈ లోటును పూడుస్తారు.

➠ ప్రత్యక్ష పన్నులు:

ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయపన్ను, సంపద పన్ను, ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌ వంటికి ఈ కోవలోకి వస్తాయి. ఈ పన్నులను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ పర్యవేక్షిస్తుంది. 

➠ పరోక్ష పన్నులు :

నేరుగా మనం చెల్లించకుండా వివిధ వస్తువులు, సేవలపై ప్రభుత్వం వేసే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. జీఎస్టీ, వ్యాట్‌, సేల్స్‌ట్యాక్స్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ వంటికి పరోక్ష పన్నుల కేటగిరిలోకి వస్తాయి. ఈ పన్నులు సదరు వస్తువులు, సేవలను అందించే కంపెనీల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి. 

➠ సెస్‌లు :

మనం చెల్లించే పన్నులకు అదనంగా కొంత శాతం మేర విధించే ప్రత్యేక పన్నులు/చార్జీలను సెస్‌లుగా చెప్పవచ్చు. ఎడ్యూకేషన్‌ సెస్‌, కృషికళ్యాణ్‌ సెస్‌, స్వచ్ఛభారత్‌ సెస్‌, పెట్రోల్‌ డిజిల్‌పై సెస్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెస్‌లుగా వసూలు చేసే మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. 

➠ సర్‌ చార్జీలు :

అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, సేవలపై అదనంగా విధించే చార్జీలను సర్‌ చార్జీలు అంటారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాలు ధనిక కేటగిరిల్లోని వారు వినియోగించే ఖరీదైన వస్తువులు, సేవలపై సర్‌ చార్జీలను విధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు విలాసవంతమైన కార్లు, ఖరీదైన బైకులు, దిగుమతి చేసుకునే వాహనాలు వంటివి. దీనికితోడు అత్యధిక ఆదాయం ఉండేవారి నుండి వసూలు చేసే ఆదాయయ పన్నుపైనా సర్‌ చార్జీలు ఉన్నాయి. 

➠ డిజిన్వేస్టిమెంట్‌ :

ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్మడం, లేదా పూర్తిగా విక్రయించడం లేదా స్టాక్‌మార్కెట్లో వాటిని లిస్ట్‌ చేయడం ద్వారా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వేస్ట్‌మెంట్‌) అంటారు. 

➠ ఓటాన్‌అకౌంట్‌ :

బడ్జెట్‌ ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి నిడివికి సంబందించి ఉంటుంది. అనగా ఏప్రిల్‌ 1వ తేది నుండి వచ్చే సంవత్సరం మార్చి 31వరకు ఉంటుంది. కానీ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పదవీకాలం ఈ మద్యకాలంలో ముగిస్తే పూర్తిస్థాయి బడ్జెన్‌ను ప్రవేశపెట్టడం కుదరదు. సదరు ప్రభుత్వం ఉండే పదవికాలానికి మాత్రమే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనినే ఓటాన్‌అకౌంట్‌ అంటారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

Post a Comment

0 Comments