Netaji Subhas Chandra Bose History in Telugu
నేతాజీ సుభాష్ చంద్రబోస్ – స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత
ప్రారంభ జీవితం
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ధైర్యవంతమైన నాయకులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది. విద్యలో ప్రతిభ కనబరిచిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వ సేవలో పనిచేయడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశారు.
రాజకీయ ప్రస్థానం
1921లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన బోస్ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కలకత్తా మేయర్గా సేవలందించడంతో పాటు చిత్తరంజన్ దాస్ స్థాపించిన విద్యాసంస్థకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. అలాగే "ఫార్వర్డ్" పత్రికకు సంపాదకుడిగా కూడా సేవలందించారు.
చిత్తరంజన్ దాస్ను తన రాజకీయ గురువుగా భావించిన బోస్, జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో వేల్స్ యువరాజు భారత పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాత్ర
సుభాష్ చంద్రబోస్ ఎప్పుడూ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరిచేవారు. చౌరీచౌరా ఘటన అనంతరం మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
భగత్సింగ్ సహచరుడు జతీంద్రనాథ్ దాస్ జైలులో నిరాహార దీక్ష చేస్తూ మరణించిన తరువాత, ఆయన మృతదేహాన్ని కలకత్తాకు తీసుకువచ్చిన సందర్భంలో బోస్ చేసిన ఆవేశభరిత ప్రసంగం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. దీంతో మరోసారి జైలు శిక్షను అనుభవించారు.
మధురలో జరిగిన యువజన సమావేశంలో బ్రిటిష్ పాలనను విమర్శిస్తూ చేసిన ప్రసంగం కారణంగా కూడా ఆయనను అరెస్టు చేశారు.
స్వరాజ్య పార్టీ
చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన స్వరాజ్య పార్టీ నిర్మాణంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం 1935ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా
1938లో గుజరాత్లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి గడువు విధించాలని, బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరిక జారీ చేయాలని పిలుపునిచ్చారు.
1939లో త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ మద్దతు ఉన్న పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే గాంధీజీతో ఏర్పడిన భావజాల విభేదాలు మరియు ఇతర నాయకుల సహకారం లేకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ను వీడారు.
తరువాత "ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్" అనే రాజకీయ సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టారు.
గృహ నిర్బంధం నుండి పరారీ
బోస్ ప్రజల్లో పెరుగుతున్న ప్రభావాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే 1941లో ఆయన చాకచక్యంగా గృహ నిర్బంధం నుండి తప్పించుకుని "జియాఉద్దీన్" అనే మారుపేరుతో పేషావర్ చేరుకున్నారు.
అక్కడి నుండి భగత్రామ్ సహాయంతో కాబూల్, మాస్కో మార్గంగా జర్మనీకి చేరుకుని భారత స్వాతంత్ర్య సాధన కోసం అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.
ఆజాద్ హింద్ ఫౌజ్
జపాన్లో నివసిస్తున్న ప్రముఖ విప్లవకారుడు రాస్ బిహారీ బోస్ భారత స్వాతంత్ర్య లక్ష్యంతో ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ను స్థాపించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్ జపాన్ ఆధీనంలోకి వెళ్లిన తరువాత, బ్రిటిష్ భారత సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలతో కలిసి కెప్టెన్ మోహన్సింగ్ నాయకత్వంలో 1942లో భారత జాతీయ సైన్యం (INA) ఏర్పడింది.
జర్మనీ నుండి ఆశించిన సహకారం లభించకపోవడంతో సుభాష్ చంద్రబోస్ జలాంతర్గామి ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేసి సుమత్రాకు చేరుకున్నారు. అనంతరం టోక్యో వెళ్లి జపాన్ మద్దతుతో భారత జాతీయ సైన్యానికి నాయకత్వం వహించారు.

0 Comments