ఛత్రపతి శివాజీ మహారాజ్
17వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా మరాఠా సామ్రాజ్యం అవతరించింది. మహారాష్ట్ర ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భక్తి ఉద్యమ ప్రభావం, బీజాపూర్ మరియు అహ్మద్నగర్ రాజ్యాలలో మరాఠాలకు లభించిన సైనిక అనుభవం వీరి ఎదుగుదలకు ప్రధాన కారణాలయ్యాయి.
మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిన గొప్ప నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన స్వరాజ్య స్థాపనతో భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. అనంతరం పీష్వాల నాయకత్వంలో మరాఠాలు ఉత్తర భారతదేశ రాజకీయాల్లో కూడా కీలక శక్తిగా ఎదిగారు.
శివాజీ (1627-1680)
శివాజీ 1627లో శివనేర్ దుర్గంలో జన్మించారు. ఆయన తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియాబాయి. చిన్ననాటి నుంచే జిజియాబాయి దేశభక్తి, ధర్మరక్షణ భావాలను శివాజీలో నాటారు. దాదాజీ కొండదేవ్ వద్ద సైనిక, పరిపాలనా శిక్షణ పొందిన శివాజీ అసాధారణ నాయకుడిగా ఎదిగారు.తుకారాం, సమర్థ రామదాస్ వంటి భక్తి ఉద్యమ నాయకుల ప్రభావం కూడా శివాజీ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడింది.
శివాజీ తొలి విజయాలు
- 1646లో తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
- చాకన్, కొండన, పురంధర్, రాయగడ్ కోటలను జయించాడు.
- రాయగడ్ను రాజధానిగా అభివృద్ధి చేశాడు.
- బీజాపూర్ సుల్తాన్తో జరిగిన ఒప్పందం ద్వారా తన తండ్రి షాజీ భోంస్లేను విడుదల చేయించాడు.
- తర్వాత తన రాజ్యాన్ని బలోపేతం చేసేందుకు కొన్నేళ్లు పరిపాలనపై దృష్టి పెట్టాడు.
అఫ్జల్ ఖాన్ ఉదంతం (1659)
శివాజీ శక్తి పెరుగుతుండటంతో బీజాపూర్ సుల్తాన్ తన సేనాని అఫ్జల్ ఖాన్ను పంపించాడు. సమావేశం పేరిట శివాజీని హత్య చేయాలని కుట్ర పన్నాడు.ఈ కుట్రను ముందుగానే తెలుసుకున్న శివాజీ రక్షణ కవచం ధరించి, తన ప్రసిద్ధ బాగ్నఖ్ ఆయుధంతో అఫ్జల్ ఖాన్ను సంహరించాడు. అనంతరం బీజాపూర్ సైన్యాన్ని ఓడించి అపార ధనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
మొగల్ - మరాఠా సంబంధాలు
ఔరంగజేబ్ మరాఠాల శక్తిని అణచివేయడానికి షాయిస్తఖాన్ను దక్కన్ గవర్నర్గా నియమించాడు. 1663లో శివాజీ పూనేలో షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.1664లో శివాజీ సూరత్ రేవు పట్టణాన్ని దోచుకొని అపార సంపదను స్వాధీనం చేసుకున్నాడు.తర్వాత మీర్జా రాజా జైసింగ్తో జరిగిన యుద్ధంలో శివాజీ పురంధర్ సంధికి అంగీకరించాడు.
పురంధర్ సంధి ముఖ్యాంశాలు
- 23 కోటలను మొగలులకు అప్పగించాడు.
- సుమారు నాలుగు లక్షల హౌణ్ల ఆదాయం కోల్పోయాడు.
- శంభాజీకి 5000 మన్సబ్ హోదా లభించింది.
- మొగల్ ఆస్థానాన్ని సందర్శించేందుకు అంగీకరించాడు.
శివాజీ పరిపాలన
శివాజీ రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు.
| ప్రాంతం | వివరణ |
|---|---|
| స్వరాజ్యం | నేరుగా శివాజీ పరిపాలించిన ప్రాంతం |
| మొగలాయ్ | చౌత్, సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేసిన ప్రాంతం |
అష్టప్రధానులు
| మంత్రి | బాధ్యత |
|---|---|
| పీష్వా | ప్రధానమంత్రి |
| అమాత్య | ఆర్థిక మంత్రి |
| మంత్రి | అంతర్గత వ్యవహారాలు |
| సుమంత్ | విదేశీ వ్యవహారాలు |
| సచివ | రాజ్య ఉత్తర ప్రత్యుత్తరాలు |
| పండిత్రావ్ | మత వ్యవహారాలు |
| సేనాపతి | సైనిక వ్యవహారాలు |
| న్యాయాధీశ్ | ప్రధాన న్యాయమూర్తి |
రెవెన్యూ వ్యవస్థ
- జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు.
- రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
- పంటలో 2/5 వంతు భూమిశిస్తుగా నిర్ణయించాడు.
- చౌత్ మరియు సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేశాడు.
చౌత్ & సర్దేశ్ముఖి
| పన్ను | వివరణ |
|---|---|
| చౌత్ | జిల్లా ఆదాయంలో నాలుగోవంతు. రక్షణ పన్ను. |
| సర్దేశ్ముఖి | జిల్లా ఆదాయంలో పదోవంతు. గౌరవ పన్ను. |
శివాజీ సైనిక వ్యవస్థ
- సుమారు 250 కోటలను నిర్మించాడు.
- గెరిల్లా యుద్ధ తంత్రంలో నైపుణ్యం సాధించాడు.
- బార్గీర్ మరియు సిలేదార్ అశ్వికదళాలను ఏర్పాటు చేశాడు.
- శక్తివంతమైన గూఢచారి వ్యవస్థను అభివృద్ధి చేశాడు.
- సైనికులకు నగదు జీతాలు చెల్లించాడు.
- గాయపడిన సైనికులకు భత్యాలు, మరణించిన వారి కుటుంబాలకు పింఛన్లు ఇచ్చాడు.
- సైన్యంలో కఠిన క్రమశిక్షణ అమలు చేశాడు.
శివాజీ నౌకాదళం
కొంకణ తీర రక్షణ కోసం శివాజీ శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించాడు. ఇందులో 200కు పైగా యుద్ధ నౌకలు, 80 ఫిరంగులు ఉండేవి. కొలాబా ప్రధాన నౌకా స్థావరంగా ఉండేది.
మరాఠా సామ్రాజ్యం ముఖ్యాంశాలు
| అంశం | వివరం |
|---|---|
| స్థాపకుడు | ఛత్రపతి శివాజీ |
| జననం | 1627, శివనేర్ దుర్గం |
| తండ్రి | షాజీ భోంస్లే |
| తల్లి | జిజియాబాయి |
| రాజధాని | రాయగడ్ |
| ప్రసిద్ధ ఆయుధం | బాగ్నఖ్ |
| ప్రసిద్ధ యుద్ధతంత్రం | గెరిల్లా యుద్ధం |
| మంత్రివర్గం | అష్టప్రధానులు |
| మరణం | 1680 |

0 Comments