
ఆంగ్లో -మైసూర్ యుద్దాలు
Anglo-Mysore Wars in Telugu | Indian History in Telugu
ఆంగ్లో -మైసూర్ యుద్దాలు 1766 నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు బ్రిటిషువారికి మరియు మైసూర్ పాలకులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ల మధ్య జరిగాయి. ఆంగ్లో - మైసూర్ యుద్దాలు మొత్తం నాలుగు జరిగాయి. దక్షిణ భారతదేశంలో బ్రిటిషువారి ఆక్రమణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రాజ్యాలలో మైసూర్ రాజ్యం ఒకటి. మైసూర్ తరపున హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్లు బ్రిటిషువారికి వ్యతిరేకంగా జరిపిన పోరాట పటిమతో భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారు.
➺ మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్దం (1767-69) :
ఈ యుద్దం వారన్హెస్టింగ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యానికి మరియు మైసూర్ పాలకుడైన హైదరాలీలకు మధ్య జరిగింది. ఈ యుద్దంలో బ్రిటిష్ వారు ఓడిపోయారు. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని పారదోలాలనే ఆలోచనలో ఉన్న మైసూర్ పాలకుడైన హైదర్ ఆలీ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. హైదర్ ఆలీ ద్వారా తమకు ప్రమాదమని భావించిన ఆంగ్లేయులు హైదరాలీకి వ్యతిరేకంగా మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదర్ ఆలీ మద్రాసును ఆక్రమించుకునే సమయంలో బ్రిటిషు వారు సంధికి ఒప్పుకున్నారు. రెండు పక్షాలు పరస్పరం ఆక్రమించుకున్న భూభాగాలను పునరుద్దరించడానికి, మూడో పక్షం దాడి చేసినప్పుడు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.
➺ రెండో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1780-84) :
ఆంగ్లేయులు మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దంలో కుదుర్చుకున్న మద్రాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో రెండో ఆంగ్లో - మైసూర్ యుద్దం జరిగింది. ఈ యుద్దం హైదర్ ఆలీ మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. హైదరాలీపై మరాఠాలు దాడి చేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదరాలీకి బ్రిటిషు వారు సహకరించాలి. కానీ అలా జరగకుండా బ్రిటిషువారు తటస్థ వైఖరితో ఉన్నారు. దీంతో బ్రిటిషు వారు మద్రాసు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయింది. బ్రిటిషువారు - ఫ్రెంచివారి మధ్య యూరప్లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన ‘మహే’ను బ్రిటిషు వారు ఆక్రమించుకున్నారు. దీంతో హైదరాలి బ్రిటిషువారికి వ్యతిరేకంగా నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Also Read :
అయితే అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ తన తెలివితో నిజాం, మరాఠాలను తనవైపు తిప్పుకున్నాడు. తర్వాత బ్రిటిష్ సేనాని సర్య్కూట్ హైదరాలీని ఓడించాడు. 1782లో హైదరాలీ క్యాన్సర్తో మరణించాడు. దీంతో హైదరాలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ద బాద్యతలు స్వీకరించాడు. 1784 నాటికి ఎవరూ గెలిచేట్లు లేకపోవడంతో మంగుళూరు ఒప్పందం చేసుకున్నారు. ఈ మంగుళూరు ఒప్పందం ప్రకారం రెండు వైపులా పరస్పరం స్వాధీనం చేసుకున్న భూభాగాలను పునరుద్దరించి యుద్ద ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది.
➺ మూడో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1790-92) :
టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా బ్రిటిషు వారు మరాఠాలు, నిజాంలతో ఒప్పందం కుదుర్చుకోవడం, టిప్పుసుల్తాన్ ప్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం, బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్ కోర్ రాజుపై టిప్పుసుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణలు వంటి కారణాలతో మూడో మైసూర్ యుద్దం బ్రిటిషు వారికి మరియు టిప్పుసుల్తాన్కు మధ్య జరిగింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్పై యుద్దం ప్రకటించాడు. కారన్ వాలీస్ స్వయంగా యుద్దానికి నాయకత్వం వహించాడు. కారన్వాలీస్ మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. టిప్పు సుల్తాన్తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో బ్రిటిషువారు శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నారు. ఈ శ్రీరంగ పట్నం ఒప్పందం ప్రకారం టిప్పు సుల్తాన్ తన భూభాగంలో దాదాపు సగభాగం బ్రిటిషువారికి ఇవ్వాలి. యుద్దం నష్టపరిహారంగా మూడు కోట్లు ఆంగ్లేయులకు చెల్లించాలి. మూడు కోట్లు చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి.
➺ నాలుగో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1798-99) :
బ్రిటిషువారి చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్న టిప్పుసుల్తాన్ ప్రాన్స్, ముస్లీం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం రాయబారులను పంపాడు. దీంతో టిప్పు సుల్తాన్ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని గ్రహించిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్దతి ప్రవేశపెట్టాడు. ఈ పద్దతిని అంగీకరించని టిప్పు సుల్తాన్పై బ్రిటిషు వారు యుద్దం ప్రకటించారు. జనరల్ స్టువర్డ్ నేతృత్వంలోని బొంబాయి సైన్యం పశ్చిమం నుండి మైసూర్పై దాడి చేశారు. లార్డ్ వెల్లస్లీ సోదరుడైన ఆర్ధర్ వెల్లస్లీ నేతృత్వంలోని మద్రాసు సైన్యం శ్రీరంగపట్నంపై దండెత్తింది. శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి బ్రిటిషు వారి చేతిలో 1799లో మరణించాడు. మైసూర్, శ్రీరంగపట్నంలను బ్రిటిషువారు పునరుద్దరించి మళ్లీ వడయార్ రాజవంశాకి చెందిన కృష్ణరాజ వడయార్ -3కి అప్పగించి రాజుగా చేశారు.
టిప్పు సుల్తాన్ (క్రీ.శ 1750-99)
టిప్పు సుల్తాన్ పూర్తి పేరు ఫతే అలీ టిప్పు. ఇతను హైదర్ అలీ - ఫాతిమా దంపతులకు 1750లో జన్మించాడు. టిప్పు సుల్తాన్ దక్షిణ భారతదేశంలో ఉన్న మైసూర్ రాజ్యానికి పాలకుడిగా పనిచేశాడు. ఫ్రెంచ్ వారి కోరిక మేరకు మైసూర్లో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. 1782లో జరిగిన రెండవ మైసూర్ యుద్దంలో తండ్రికి కుడిభుజంగా పనిచేసాడు. తండ్రి హైదర్ అలీ మరణాంతరం రెండో మైసూర్ యుద్దంలో మంగళూరు ఒప్పందం చేసుకున్నాడు. మూడవ, నాల్గవ మైసూర్ యుద్దాలలో బ్రిటీషువారి చేతిలో ఓడిపోయాడు.
Also Read :
0 Comments