
List of Battles in Indian History in Telugu | History in Telugu భారతదేశ చరిత్రలో ముఖ్యమైన పోరాటాలు మరియు ప్రసిద్ధ యుద్ధాలు
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
➺ కళింగ యుద్ధం :
కళింగ యుద్దం అనేది మౌర్య సామ్రాజ్యానికి మరియు కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. ఈ యుద్దానికి అశోక చక్రవర్తి నాయకత్వం వహించాడు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత భయానక, రక్తపాత యుద్దంగా కీర్తి సాధించింది. కళింగ, మౌర్య రెండు సామ్రాజ్యాల మధ్య భీకర యుద్దం జరిగినా చివరకు మౌర్యులు విజయం సాధించి కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
➺ పుల్లలూర్ యుద్ధం :
పుల్లలూర్ యుద్దం 7వ శతాబ్దంలో జరిగింది. ఈ యుద్దం చాళుక్య రాజు రెండవ పులకేసి మరియు పల్లవ రాజు అయిన మహేంద్రవర్మన్ల మధ్య పుల్లలూర్ (పొల్లిలూర్) ప్రాంతంలో సుమారు క్రీ.శ 618-19లో జరిగింది.
➺ మణిమంగళ యుద్ధం (642) :
మణిమంగళ యుద్దం పల్లవుల రాజు మొదటి నర్సింహవర్మకి మరియు చాళుక్య రాజు రెండవ పులకేశిల మధ్య క్రీ.శ 642లో జరిగింది. ఈ యుద్దంలో చాళుక్యులపై పల్లవులు విజయం సాధించారు.
➺ పెషావర్ యుద్ధం (1000) :
పెషావర్ యుద్దం ఘజనీ మహ్మద్ మరియు జయపాలుడి మధ్య క్రీ.శ 1000 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్దంలో హిందషాహి పాలకుడైన జయపాలుడిపై ఘజనీ మహ్మద్ విజయం సాధించాడు. ఈ యుద్దంలో విజయం సాధించడం ద్వారా ఘజనీ మహ్మద్ భారతదేశంలోకి అడుగుపెట్టాడు.
➺ మొదటి తరైన్ యుద్ధం (1191) :
మొదటి తరైన్ యుద్దం మహ్మద్ ఘోరి మరియు పృథ్విరాజ్ చౌహన్ల మధ్య 1191 సంవత్సరంలో తరైన ప్రాంతంలో జరిగింది. ఈ మొదటి తరైన యుద్దంలో పృథ్విరాజ్ చౌహన్ విజయం సాధించాడు.
➺ రెండవ తరైన్ యుద్ధం (1192) :
రెండవ తరైన్ యుద్దం మహ్మద్ ఘోరి మరియు పృథ్విరాజ్ చౌహన్ల మధ్య 1192 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్దంలో మహ్మద్ ఘోరి విజయం సాధించాడు.
➺ చాంద్వర్ యుద్ధం (1194) :
చాంద్ యుద్దం మహ్మద్ ఘోరి మరియు జయచంద్రుని మధ్య 1194లో ఫిరోజాబాద్ సమీపంలోని చాందవర్ ప్రాంతంలో జరిగింది. ఈ చాంద్వర్ యుద్దంలో మహ్మద్ ఘోరి జయచంద్రున్ని ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ యుద్దంలో విజయం సాధించడం వల్ల ఉత్తర భారతదేశంలోని చాలా భాగాన్ని మహ్మద్ ఘోరి తన ఆదీనంలోకి తీసుకున్నాడు.
➺ మొదటి పానిపట్టు యుద్ధం (1526) :
మొదటి పానిపట్టు యుద్దం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ మరియు ఇబ్రహీం లోడిల మధ్య 1526లో జరిగింది. ఈ యుద్దంలో బాబర్ అధునాతన యుద్ద పద్దతులను ఉపయోగించి ఇబ్రహీం లోడిపై విజయం సాధించాడు. ఈ యుద్దంలో విజయం సాధించడం ద్వారా బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాందిగా నిలించింది.
➺ కాన్వా యుద్ధం (1527) :
కాన్వా యుద్దం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరియు మేవార్ రాణా సంగా మధ్య 1527 లో జరిగింది. ఈ కాన్వా యుద్దంలో బాబర్, రాణా సంగాను ఓడించాడు.
➺ చందేరీ యుద్ధం (1528) :
చందేరి యుద్దం మేదీని రాయ్ మరియు మొఘల్ చక్రవర్తి బాబర్ల మధ్య జరిగింది. ఈ యుద్దంలో బాబర్, మేదినీ రాయ్ని ఓడించాడు. ఈ యుద్దంలో విజయం సాధించడం ద్వారా చందేరి పూర్తిగా బాబర్ నియంత్రణలోకి వచ్చింది.
➺ గోగ్రా యుద్ధం (1529) :
ఆప్ఘన్ల కూటమి నాయకులైన నుస్రత్ షా, మహ్మద్ లోడీలకు మరియు మొఘల్ చక్రవర్తి బాబర్ల మధ్య 1529లో జరిగింది. ఈ యుద్దంలో ఆప్ఘన్ల కూటమిపై బాబర్ విజయం సాధించాడు.
➺ రెండో పానిపట్టు యుద్ధం (1556) :
రెండో పానిపట్టు యుద్దం మొఘల్ వారసుడైన అక్బర్ సంరక్షుడిగా ఉన్న బైరంఖాన్కు, ఆప్ఘనిస్తాన్కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య జరిగింది. ఇందులో విజయం మొఘల్ నాయకుడు బైరంఖాన్ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై పట్టు నిలుపుకున్నారు.
➺ తళ్లికోట యుద్ధం (1565) :
దక్కన్ సుల్తాన్లు అయిన అలీ ఆదిల్షా, హుస్సెన్ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్షా, అలీ బరీద్లు కూటమిగా ఏర్పడి క్రీ.శ 1565లో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. దీనికి తళ్లికోట లేదా రాక్షస తంగడి యుద్దం అని పేరు వచ్చింది. ఇందులో దక్కన్ సుల్తాన్ల చేతిలో విజయనగర రాజులు ఓటమిపాలయ్యారు. ఈ తళ్లికోట యుద్దంలో రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమవైపున తిరుమల రాయలు, అలీ ఆదిల్ షాను ఎదుర్కొనేలా, మధ్యన రామరాయలు హుస్సెన్ నిజజాంషాతో పోరాడేలా, కుడివైపున వెంకటాద్రిరాయలు ఇబ్రహీం కుతుబ్షా, అలీ బరీద్లను ఎదుర్కొనే విధంగా యుద్దవ్యూహరచ చేశాడు. కానీ దక్కన్ సుల్తానులు ఆధునిక ఫిరంగులను ఉపయోగించడంతో విజయనగర సైనికులు వీటిని తట్టుకోలేకపోయారు. హుస్సెన్ నిజాం షా సైన్యం రామరాయలను బంధించి హుస్సెన్ నిజాం షా అతన్ని వధించాడు. దీంతో విజయనగర రాజ్యం చిన్నాభిన్నమైంది. ఈ యుద్దంలో వెంకటాద్రి రాయలు కూడా మరణించాడు. తిరుమల రాయలు, సదాశివ రాయలు యుద్దభూమి నుండి పారిపోయారు.
Also Read :
➺ హల్దిఘాట్ యుద్ధం (1576) :
హల్దిఘాట్ యుద్దం 1576 న మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని మేవార్ దళాలు, అంబర్కు చెందిన మాన్ సింగ్ - 1 నేతృత్వంలోని మొఘల్ దళాల మధ్య జరిగింది. మొఘలులు మేవార్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కల్గించి యుద్దంలో విజయం సాధించారు. రాణా ప్రతాప్ తోటి సైనికాధికారుల బలవంతంపై యుద్దరంగం విడిచి వెళ్లిపోయాడు. దాంతో మొగలు సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది.
➺ భోపాల్ యుద్దం (1737) :
భోపాల్ యుద్దం 1737లో భోపాల్లో మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం యొక్క సంయుక్త సైన్యం మరియు అనేకమంది మొగల్ జనరల్స్ మధ్య జరిగింది. ఈ యుద్దంలో పిష్వా మొదటి బాజీరావు చేతిలో నిజం ఓటమి పాలయ్యాడు.
➺ కర్నాల్ యుద్దం (1739) :
ఈ యుద్దం మొగలులు మరియు నాదిర్షాల మధ్య జరిగింది. ఈ యుద్దంలో నాదిర్షా చేతిలో మొగలులు ఓటమి పాలయ్యారు. నాదిర్ షా మరియు మహ్మద్ షా మధ్య జరిగిన ఈ యుద్దంలో నాదర్ షా విజేతగా నిలిచాడు. ఈ యుద్దంలో మహ్మద్ షా ఖజానా అంతా ఖాళీ అయ్యింది.
➺ మొదటి కర్ణాటక యుద్ధం (1745-48) :
మొదటి కర్ణాటక యుద్దం బ్రిటీష్ సైన్యం మరియు ఫ్రెంచి సైన్యం మధ్య జరిగింది. యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ద ప్రభావంతో భారతదేశంలో బ్రిటీష్ వారికి, ఫ్రెంచ్వారికి మధ్య యుద్దం మొదలు అయ్యింది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచ్ పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం మద్రాసును ఆక్రమించింది. ఆంగ్లేయులు తమను ఫ్రెంచ్వారి నుండి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచ్వారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచ్వారికి, అన్వరుద్దీన్ మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్దం జరిగింది. ఈ యుద్దంలో నవాబు ఓడిపోయాడు.
➺ రెండో కర్ణాటక యుద్దం (1749-54) :
వారసత్వ యుద్ద సమయంలో ఫ్రెంచ్వారు హైదరాబాద్లో ముజఫర్ జంగ్కు, కర్ణాటకలో చందాసాహెబ్కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్లో నాజర్ జంగ్కు, కర్ణాటకలో అన్వరుద్దీన్ తర్వాత అతడి కుమారుడు మహ్మద్ ఆలీకి మద్దతిచ్చారు. 1749 లో ఫ్రెంచ్వారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ బ్రిటీషు వారు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహ్మద్ అలీ వశమైంది.
➺ మూడో కర్ణాటక యుద్దం (1758-63) :
ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాస యుద్దంలో ఫ్రెంచ్ గవర్నర్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచ్ వారి స్థానంలో బ్రిటిష్వారు నిజాం సంరక్షణ బాద్యతలు చేపట్టారు. 1763లో ఆంగ్లేయులు ఫ్రెంచ్వారి మధ్య సంధి కుదిరింది.
➺ ప్లాసీ యుద్దం (1757) :
ప్లాసీ యుద్దం బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని బ్రిటీష్ సైన్యాలకు మధ్య 1757లో జరిగింది. ఈ యుద్దంలో నవాబు సిరాజ్ ఉద్దౌలా ఓటమి పాలయ్యాడు. ప్లాసీ యుద్దంలో విజయం సాధించడం ద్వారా బ్రిటీష్ వారు బెంగాల్ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఔరంగజేబు మరణాంతరం మొగల్ సామ్రాజ్యం పాలనలో ఈ యుద్దం జరిగింది. ప్లాసీ యుద్దం జరిగేటప్పుడు మొగల్ చక్రవర్తిగా రెండవ ఆలంగీర్ చక్రవర్తిగా ఉన్నాడు. బెంగాల్ నవాబ్ బ్రిటీష్ వారికి ఇచ్చిన వాణిజ్య అధికారాలను తరచుగా ‘దస్తక్’ అని పిలుస్తారు. బ్రిటీష్ ఈస్ట్ఇండియా కంపెనీ కార్మికులు పన్ను మరియు సుంకాలు చెల్లించకపోవడం మరియు నవాబు అనుమతి లేకుండా బ్రిటీష్ వారు కలకత్తా కోటను సందర్శించడం వంటి కారణాల వల్ల ప్లాసీ యుద్దానికి దారితీసింది.
➺ బక్సార్ యుద్దం (1757) :
బక్సార్ యుద్దం బెంగాల్ నవాబు మీర్ ఖాసీం, అవధ్ నవాబు షుజా-ఉద్ -దౌల్, మొగల్ చక్రవర్తి రెండో ఆలమ్షా మిత్రకూటమి మరియు మేజర్ మన్రో నాయకత్వంలోని బ్రిటీష్ సైన్యం మధ్య 1757లో జరిగింది. ఈ యుద్దంలో బ్రిటీష్ సైన్యం చేతిలో మీర్ ఖాసీం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌల్లు ఓటమి చవిచూశారు. ఈ యుద్దంలో బ్రిటీష్ సైన్యం విజయం సాధించడం ద్వారా భారత్లో వారి పట్టును మరింత దృడత్వం చేసుకున్నారు.
➺ మూడో పానిపట్టు యుద్దం (1761) :
మూడో పానిపట్ యుద్దం మహరాష్ట్రకు చెందిన రాజులకు ఆప్ఘనిస్తాన్ రాజైన అహ్మద్షా అబ్దాలీల మధ్య 1761 సంవత్సరంలో జరిగింది. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించాడు. అక్కడ నుండి అతని రాజప్రతినిధిని తరిమవేయడం ఈ యుద్దానికి ప్రధాన కారణం. దీంతో అబ్దాలీ తన సైన్యంతో మహారాష్ట్రులపైకి దండేత్తి వచ్చాడు. మహారాష్ట్ర సైన్యాధ్యక్షునిగా సదాశివరావు వ్యవహరించాడు. ఇతడిని బావో సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఇతడు పీష్వాకు దగ్గరి బందువు. భావో సమర్థుడైనా, అహంకారి. భరత్పూర్ను పాలించే జాట్ నాయకులు సూరజ్మల్, ఇతర సేనానాయకులు ప్రత్యక్ష యుద్దం కాకుండా ‘గెరిల్లా’ యుద్దం చేయమని ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టాడు. దీంతో సూరజ్మల్ తన సైన్యంతో వెనుతిరిగి వెళ్లిపోయాడు. అబ్దాలీ రోహిల్లాలు, ఔద్ నవాబు సహకారం పొందగలిగాడు. అబ్దాలీ ఆహార ధాన్యలను అడ్డగించడంతో మహారాష్ట్ర సైన్యం ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. సుమారు రెండున్నర నెలల పాటు సైన్యాలు ముఖాముఖి గా పోరాడాయి. చివరికి శత్రువులపై మహారాష్ట్రులు దాడి చేసారు. ఈ యుద్దంలో మహారాష్ట్రులు ఓడిపోయారు. సదాశివరావు, పీష్వా కుమారుడు విశ్వాసరావు యుద్దభూమిలో మరణించారు. సుమారు 2 లక్షల మహారాష్ట్రకు చెందిన వారు మరణించారు. మహాదాజి సింధియా కాలికి గాయమై యుద్దభూమి నుండి వెళ్లిపోయాడు. ఈ ఓటమితో కుంగిపోయిన పీష్వా అయిదు నెలల అనంతరం పుణేలో మరణించాడు.
➺ మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్దం (1767-69) :
ఈ యుద్దం వారన్హెస్టింగ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యానికి మరియు మైసూర్ పాలకుడైన హైదరాలీలకు మధ్య జరిగింది. ఈ యుద్దంలో బ్రిటిష్ వారు ఓడిపోయారు. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని పారదోలాలనే ఆలోచనలో ఉన్న మైసూర్ పాలకుడైన హైదర్ ఆలీ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. హైదర్ ఆలీ ద్వారా తమకు ప్రమాదమని భావించిన ఆంగ్లేయులు హైదరాలీకి వ్యతిరేకంగా మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదర్ ఆలీ మద్రాసును ఆక్రమించుకునే సమయంలో బ్రిటిషు వారు సంధికి ఒప్పుకున్నారు. రెండు పక్షాలు పరస్పరం ఆక్రమించుకున్న భూభాగాలను పునరుద్దరించడానికి, మూడో పక్షం దాడి చేసినప్పుడు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.
➺ రెండో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1780-84) :
ఆంగ్లేయులు మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దంలో కుదుర్చుకున్న మద్రాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో రెండో ఆంగ్లో - మైసూర్ యుద్దం జరిగింది. ఈ యుద్దం హైదర్ ఆలీ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. హైదరాలీపై మరాఠాలు దాడి చేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదరాలీకి బ్రిటిషు వారు సహకరించాలి. కానీ అలా జరగకుండా బ్రిటిషువారు తటస్థ వైఖరితో ఉన్నారు. దీంతో బ్రిటిషు వారు మద్రాసు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయింది. బ్రిటిషువారు - ఫ్రెంచివారి మధ్య యూరప్లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన ‘మహే’ను బ్రిటిషు వారు ఆక్రమించుకున్నారు. దీంతో హైదరాలి బ్రిటిషువారికి వ్యతిరేకంగా నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అయితే అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ తన తెలివితో నిజాం, మరాఠాలను తనవైపు తిప్పుకున్నాడు. తర్వాత బ్రిటిష్ సేనాని సర్య్కూట్ హైదరాలీని ఓడిరచాడు. 1782లో హైదరాలీ క్యాన్సర్తో మరణించాడు. దీంతో హైదరాలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ద బాద్యతలు స్వీకరించాడు. 1784 నాటికి ఎవరూ గెలిచేట్లు లేకపోవడంతో మంగుళూరు ఒప్పందం చేసుకున్నారు. ఈ మంగుళూరు ఒప్పందం ప్రకారం రెండు వైపులా పరస్పరం స్వాధీనం చేసుకున్న భూభాగాలను పునరుద్దరించి యుద్ద ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది.
➺ మూడో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1790-92) :
టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా బ్రిటిషు వారు మరాఠాలు, నిజాంలతో ఒప్పందం కుదుర్చుకోవడం, టిప్పుసుల్తాన్ ప్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం, బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్ కోర్ రాజుపై టిప్పుసుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణలు వంటి కారణాలతో మూడో మైసూర్ యుద్దం బ్రిటిషు వారికి మరియు టిప్పుసుల్తాన్కు మధ్య జరిగింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్పై యుద్దం ప్రకటించాడు. కారన్ వాలీస్ స్వయంగా యుద్దానికి నాయకత్వం వహించాడు. కారన్వాలీస్ మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. టిప్పు సుల్తాన్తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో బ్రిటిషువారు శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నారు. ఈ శ్రీరంగ పట్నం ఒప్పందం ప్రకారం టిప్పు సుల్తాన్ తన భూభాగంలో దాదాపు సగభాగం బ్రిటిషువారికి ఇవ్వాలి. యుద్దం నష్టపరిహారంగా మూడు కోట్లు ఆంగ్లేయులకు చెల్లించాలి. మూడు కోట్లు చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి.
ఇవి కూడా చదవండి :
➺ నాలుగో ఆంగ్లో - మైసూర్ యుద్దం (1798-99) :
బ్రిటిషువారి చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్న టిప్పుసుల్తాన్ ప్రాన్స్, ముస్లీం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం రాయబారులను పంపాడు. దీంతో టిప్పు సుల్తాన్ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని గ్రహించిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్దతి ప్రవేశపెట్టాడు. ఈ పద్దతిని అంగీకరించని టిప్పు సుల్తాన్పై బ్రిటిషు వారు యుద్దం ప్రకటించారు. జనరల్ స్టువర్డ్ నేతృత్వంలోని బొంబాయి సైన్యం పశ్చిమం నుండి మైసూర్పై దాడి చేశారు. లార్డ్ వెల్లస్లీ సోదరుడైన ఆర్ధర్ వెల్లస్లీ నేతృత్వంలోని మద్రాసు సైన్యం శ్రీరంగపట్నంపై దండెత్తింది. శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి బ్రిటిషు వారి చేతిలో 1799లో మరణించాడు. మైసూర్, శ్రీరంగపట్నంలను బ్రిటిషువారు పునరుద్దరించి మళ్లీ వడయార్ రాజవంశానికి చెందిన కృష్ణరాజ వడయార్ -3కి అప్పగించి రాజుగా చేశారు.
➺ మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం (1775-82) :
మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం బ్రిటీష్ సైన్యానికి మరియు మరాఠా సామ్రాజ్యానికి జరిగింది. సూరత్ సంధి మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1772 సంవత్సరంలో పీష్వాగా ఉన్న మాధవరావు మరణించడం జరిగింది. దీంతో మాధవరావు తమ్ముడు అయిన నారాయణరావు పీష్వా అయ్యాడు. ఇది తన పినతండ్రి రఘునాథరావుకు ఇష్టం లేదు. దీంతో నారాయణరావును హత్య చేయించి తానే పీష్వా అయ్యాడు. ఈ సంఘటను గుర్తించిన మరాఠా సర్దారులు నానాఫడ్నవిస్ నాయకత్వంలో ఒక్కతాటిపై నడిచి నారాయణరావు కుమారుడు రెండో మాధవరావును పీష్వాగా ప్రకటించారు. దీనిని వ్యతిరేకించిన రఘునాథరావు బ్రిటిషువారితో 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. ఈ సూరత్ సంధి ప్రకారం బ్రిటీష్ కంపనీ రఘునాథరావును పీష్వాగా నియమించాలి. దీనికి బదులుగా అతడు సాల్సెటీ, బేసిన్ ప్రాంతాలను కంపెనీకి ఇవ్వాలి. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న బ్రిటిషువారు దీనికి ఒప్పుకున్నారు.
మరాఠా సర్ధారులు పీష్వాను బలపరిచే వారి నాయకుడు నానాఫడ్నవిస్ నాయకత్వంలో బ్రిటిషువారిని ఎదిరించారు. ఇరువర్గాలకు విజయం దక్కకపోవడంతో 1782లో సాల్బాయ్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ సాల్భాయ్ శాంతి ఒప్పందం ప్రకారం ఇరుపక్షాల వారు తాము జయించిన ప్రాంతాలు తిరిగి ఇవ్వాలి. బ్రిటిషు వారు రెండో మాధవరావును పీష్వాగా గుర్తించారు. ఈ యుద్దం వల్ల మరాఠా సామ్రాజ్యంలో బ్రిటిషువారు జోక్యం చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
➺ రెండో ఆంగ్లో - మరాఠా యుద్దం (1803-06) :
నానా ఫడ్నవిస్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యం క్షీణించింది. రెండవ మాధవరావు మరణంతో రెండవ బాజీరావు (రఘునాథరావు కుమారుడు) పీష్వా అయ్యాడు. 1802లో జరిగిన పుణె యుద్ధంలో ఇండోర్ హోల్కర్ల అధిపతి యశ్వంతరావు హోల్కర్ పీష్వాలు సింధియాలను ఓడించాడు. ఈ యుద్దంలో ఓడిపోయిన రెండవ బాజీరావ్ సహాయం కోసం బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న లార్డ్ వెల్లస్లీని ఆశ్రయించాడు. రెండవ బాజీరావు సైన్య సహకార పద్దతి (సబ్సిడరీ అలయెన్స్)కు అంగీకరించి 1802లో బస్సెన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బస్సెన్ ఒప్పందం ప్రకారం రెండవ బాజీరావు బ్రిటీష్వారికి తన రాజ్య భూభాగాన్ని అప్పగించి అక్కడ బ్రిటీష్ సైన్యాన్ని నిర్వహించాలి. సింధియాలు, భోంస్లేలు ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. ఈ వ్యతిరేకతే రెండో ఆంగ్లో -మరాఠా యుద్దానికి కారణంగా మారింది. హోల్కర్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధాల్లో మరాఠా సైన్యాలన్ని బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయాయి.
➺ మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం (1817-18) :
లార్డ్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో పిండారీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. వీరికి మరాఠాల సహకారం ఉందని బ్రిటిషు వారు బలంగా నమ్మారు. దీంతో మూడో ఆంగ్లో - మరాఠా యుద్దానికి అంకురార్పణ జరిగింది. మరాఠా రాజులు పీష్వా రెండవ బాజీరావు, మల్హర్రావు హోల్కర్, రెండవ ముధోజీ భోంస్లే అంగ్లేయులకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డారు. మరో మరాఠా పాలకుడైన దౌలత్రావ్ షిండే కూటమిలో కలవకుండా బ్రిటిష్ వారికి మద్దతిచ్చాడు. ఖడ్కి, కోరెగావ్ యుద్దాల్లో పీష్వా రెండవ బాజీరావ్ ఓడిపోయి బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. దీంతో బాజీరావ్ ఆధీనంలోని అనేక ప్రాంతాలు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి.
➺ మొదటి ఆంగ్లో - సిక్కు యుద్దం (1848-49) :
దీర్ఘకాలం పంజాబ్ సిక్కు రాజ్యాన్ని పరిపాలించిన రంజిత్ సింగ్ 1839లో మరణించడంతో సిక్కు రాజ్యంలో రాజకీయ సుస్థిరత లోపించింది. రంజిత్ సింగ్ మరణంతో తర్వాత వచ్చిన ఖరవీ సింగ్, నౌనిహాల్ సింగ్లు అసమర్థులు కావడంతో కొంతమంది సిక్కు సర్దారుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. 1843లో రంజిత్ సింగ్ కుమారుడు దిలీప్ సింగ్ సింహసనాన్ని అధిష్టించాడు. దిలీప్సింగ్ తల్లి మహారాణి జిందాన్ దిలీప్కు సంరక్షకురాలిగా మారింది. రంజిత్సింగ్ తన కాలంలో సైనిక ప్రభుత్వాన్ని స్థాపించాడు. బలహీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సైన్యం రెచ్చిపోయింది. పంజాబ్లో అశాంతి పరిస్థితులకు కారణమైంది. ఎటుచూసినా అల్లర్లు, దోపిడీలు, తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ఆంగ్లేయులను కూడా వారు హింసించారు. ఈ నేపథ్యంలో కంపెనీ సైనిక కదలికలు, దాని బలసంపత్తి పెంచుకోవడం పంజాబ్ను జయించడానికే అని ఖల్సా సైన్యంలో అనుమానాలు వచ్చాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఖల్సా సైనిక అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని మహారాణి భావించింది. అమృతసర్ ఉల్లంఘించి సట్లెజ్ నదిని దాటి ఆంగ్లేయులను ఎదుర్కొమని వారిని పురిగొల్పింది. సిక్కు సైనికులు విరోచితంగా పోరాడినా బ్రిటిషువారి ఆధునిక ఆయుధాలు, యుద్ద పద్ధతుల ముందు నిలవలేక ఓడిపోయారు. ఈ యుద్దం 1846లో లాహోర్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం జలంధర్ అంతర్వేదిని బ్రిటిషువారు ఆక్రమించారు. యుద్ధ ఖర్చుల కోసం సిక్కులు కోటిన్నర చెల్లింమనడంతో దానికి బదులు కాశ్మీర్ను ఆంగ్లేయులకు ఇచ్చేశారు.
➺ రెండో ఆంగ్లో - సిక్కు యుద్దం (1848-49) :
భారతదేశం అంతటా బ్రిటిషు సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఉన్న డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్దాంతాన్ని అమలు చేశాడు. దేశంలో ఏ సంస్థానాధీశుడైనా పుత్రులు లేకుండా మరణిస్తే దత్తత అనుమతించకుండా ఆ సంస్థానాలను కంపెనీ రాజ్యంలో కలిపేశాడు. ఈ క్రమంలో పంజాబ్ను ఆక్రమించుకోవాలనుకున్నాడు. పంజాబ్ను ఆక్రమిస్తే బ్రిటిష్ రాజ్యానికి పశ్చిమ ఆసియాదేశాలు, మధ్య ఆసియా దేశాలతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకోవచ్చని భావించారు. సర్ హ్యూగో నాయకత్వంలోని ఆంగ్ల సేనలు రాంనగర్ యుద్దం, చిలియన్ వాలా యుద్దం, గుజరాత్ యుద్దంలో సిక్కులను ఓడిరచడంతో డల్హౌసీ పంజాబ్ను ఆక్రమించాడు. మహారాజ దిలీప్సింగ్ పదవిని రద్దు చేసి భరణం మంజురు చేశాడు. భారతదేశంలో ఆఖరి స్వతంత్ర రాజ్యం ఈస్టిండియా కంపెనీలో విలీనమై బ్రిటిషు సామ్రాజ్యం బలోపేతమైంది.
0 Comments