Kushan Empire Literature and Architecture | Gandhara Art and Sculpture
కుషాణుల కాలంలోని సాహిత్యం - వాస్తు శిల్పకళ
సాహిత్య అభివృద్ధి :
కుషాణుల పాలనా కాలంలో సాహిత్యం విశేషంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కనిష్కుడు సాహిత్యానికి మరియు పండితులకు విశేష ప్రోత్సాహం అందించాడు. అతని ఆస్థానంలో అనేక మంది గొప్ప పండితులు మరియు తత్వవేత్తలు ఉన్నారు. కనిష్కుని ఆస్థానంలో ప్రముఖ బౌద్ధ పండితుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అశ్వఘోషుడు ముఖ్యస్థానం పొందాడు. అశ్వఘోషుడు బుద్ధచరితం, సౌందరనందనం, సారిపుత్రప్రకరణం వంటి ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. ఈ రచనలు బౌద్ధ సాహిత్యంలో విశిష్ట స్థానం పొందాయి.ఆ కాలంలో ప్రముఖ తత్వవేత్తగా పేరుగాంచిన ఆచార్య నాగార్జునుడు కూడా కనిష్కుని కాలానికే చెందినవాడు. బౌద్ధ తత్వశాస్త్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. నాల్గవ బౌద్ధ మత సంగీతిలో చర్చించిన అంశాలను మహావిభాష శాస్త్రం రూపంలో సంకలనం చేసిన వసుమిత్రుడు కూడా కనిష్కుని ఆస్థాన పండితుల్లో ఒకరు. కనిష్కుని ఆస్థాన వైద్యుడైన చరకుడు వైద్యశాస్త్రానికి విశేష సేవ చేశాడు. అతడు రచించిన చరకసంహిత భారత వైద్యశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన గ్రంథంగా గుర్తించబడింది.
కుషాణుల కాలంలోని వాస్తు శిల్పకళ :
కనిష్కుడు బౌద్ధమత అభివృద్ధితో పాటు వాస్తు శిల్పకళకు కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చాడు. అతడు అనేక బౌద్ధ చైత్యాలు మరియు విహారాలను నిర్మించాడు. అల్బెరూని రచనల ప్రకారం కనిష్కుడు తన రాజధాని పురుషపురం (ప్రస్తుతం పేశావర్) లో అనేక చైత్యాలు మరియు విహారాలను నిర్మించాడు. అలాగే కాశ్మీర్లో కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించినట్లు కల్హణుడు రచించిన రాజతరంగిణి ద్వారా తెలుస్తోంది.
కనిష్కుడు తన రాజధాని పురుషపురంలో 13 అంతస్తులతో కూడిన సుమారు 400 అడుగుల ఎత్తైన గొప్ప గోపురాన్ని నిర్మించాడు. ఆ గోపురంలో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ నిర్మాణాలు కుషాణుల కాలంలోని వాస్తు శిల్పకళ వైభవాన్ని తెలియజేస్తాయి.
గాంధార శిల్పకళ
కుషాణుల పాలనా కాలం భారత శిల్పకళ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందింది. ముఖ్యంగా గాంధార శిల్పకళ ఈ కాలంలో అత్యంత అభివృద్ధి చెందింది. కనిష్కుడు ఈ కళకు విశేష ప్రోత్సాహం అందించడంతో గాంధార శిల్పకళ మరింత ప్రాచుర్యం పొందింది. గాంధార శిల్పకళను ఇండో-గ్రీక్ శిల్పకళ అని కూడా పిలుస్తారు. ఈ కళకు ప్రధాన కేంద్రంగా గాంధార ప్రాంతంలోని పెషావర్ ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ ప్రాంతాన్ని గ్రీకు పాలకులు పాలించిన కారణంగా గాంధార శిల్పకళపై గ్రీకు సంస్కృతి మరియు కళా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గాంధార శిల్పకళ నిర్మాణాలలో భారతీయ శిల్పులతో పాటు గ్రీకు మరియు రోమన్ శిల్పులు కూడా పాల్గొన్నారు. అందువల్ల భారతీయ మరియు గ్రీకు కళా సంప్రదాయాల సమ్మేళనంగా గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది.
ఈ శిల్పకళలో ముఖ్యంగా బౌద్ధమతానికి సంబంధించిన శిల్పాలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. బుద్ధుడు మరియు బోధిసత్వుల విగ్రహాలను మొదటిసారిగా గాంధార శిల్పకళలోనే రూపొందించారు. బుద్ధుని జీవితంలోని ముఖ్య సంఘటనలను శిల్ప రూపంలో అద్భుతంగా ప్రతిబింబించారు.
గాంధార శిల్పకళ ప్రభావం తరువాతి కాలంలోని మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా గాంధార శిల్పకళ భారతీయ కళా చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది.

0 Comments