
కేంద్ర బడ్జెట్ - 2023
యూనియన్ బడ్జెట్ - 2023 సమగ్ర స్వరూపం
Union Budget 2023 Highlights in Telugu -
Gk in Telugu || General Knowledge in Telugu
కేంద్ర బడ్జెట్ - 2023ను కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 5వ సారి నిర్మల సీతారామన్ యూనియన్ బడ్జెట్ - 2023ను ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ - 2023 లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ వృద్ది రేటు 7% శాతంగా ఉంటుందని అంచనా. తలసరి ఆదాయం 1.97 లక్షలుగా ఉంది.
గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్ ఏర్పాటు, ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం, దేశంలో 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు, దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం, 5జి సేవల అభివృద్ది కొరకు 100 ప్రత్యేక ల్యాబ్ల ఏర్పాటు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభం, శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాణ్యాల పంటలకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈ, పెద్ద సంస్థలు, స్వచ్చంధ సంస్తల కొరకు డిజిలాకర్ వ్యవస్థ ఏర్పాటు, సికిల్ సెల్ ఎనిమియా మిషన్ ప్రారంభం,గోబర్ధన్ పథకం కింద 200 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభించనున్నారు. దీని ద్వారా దేశంలో 4 లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణను ఇచ్చి ఆర్థిక సహాయం చేయనున్నారు. 3 సంవత్సరాలలో 47 లక్షల మంది నిరుద్యోగులకు స్టైఫండ్ అందించనున్నారు. మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ పథకం ప్రారంభం. దీని ద్వారా గరిష్టంగా 2 లక్షల వరకు 7.5 శాతం వడ్డీతో సేవింగ్ చేసుకునే వీలుంటుంది.
➠ ఈ యూనియన్ బడ్జెట్ - 2023 లో ముఖ్యాంశాలు :
ఆదాయపు పన్ను పరిమితి పెంపు
ఆదాయపు పన్ను మినహయింపు 5 లక్షల నుండి 7 లక్షల వరకు పెంచడం జరిగింది. ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధానం ఉంటుంది.
3 లక్షల వరకు పన్ను మినహయింపు
ఎ) 3 లక్షల నుండి 6 లక్షల వరకు 5 శాతం ఉంటుంది.
బి) 6 లక్షల నుండి 9 లక్షల వరకు 10 శాతం ఉంటుంది.
సి) 9 లక్షల నుండి 12 లక్షల వరకు 15 శాతం ఉంటుంది.
డి) 12 లక్షల నుండి 15 లక్షల వరకు 20 శాతం పన్ను ఉంటుంది.
ఇ) ఆదాయం 15 లక్షలకు పైన ఉంటే 30 శాతం పన్ను ఉంటుంది.
➠ మొత్తం బడ్జెట్ -
45,03,097(నలబై ఐదు లక్షల మూడు వేల తొంబై ఏడు) రూపాయల కోట్లు
➠ రెవెన్యూ వసూళ్లు -
26,32,281(ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనబై ఒకటి) రూపాయల కోట్లు
➠ రెవెన్యూ వ్యయం -
35,02,136(ముప్పై ఐదు లక్షల రెండు వేల నూట ముప్పై ఆరు) రూపాయల కోట్లు
➠ మూలధన వసూళ్లు -
18,70,816(పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వంద పదహారు రూపాయల కోట్లు
➠ మూలధన వ్యయం-
10,00,961(పది లక్షల తొమ్మిది వందల అరవై ఒకటి) రూపాయల కోట్లు

రెవెన్యూ వసూళ్లు | 26,32,281 కోట్లు |
పన్ను ఆదాయం | 23,30,631 కోట్లు |
పన్నేతర ఆదాయం | 3,01,650 కోట్లు |
మూలధన వసూళ్లు | 18,70,816 కోట్లు |
ఋణాల రికవరీ | 23,000 కోట్లు |
ఇతర వసూళ్లు | 61,000 కోట్లు |
అప్పులు, ఇతర వసూళ్లు | 17,86,816 కోట్లు |
రెవెన్యూ ఖాతా | 35,02,136 కోట్లు |
వడ్డీ చెల్లింపులు | 10,79,971 కోట్లు |
మూలధన ఖాతా | 10,00,961 కోట్లు |
మొత్తం వసూళ్లు | 45,03,097 కోట్లు |
పథకాలకు వ్యయం | 35,02,136 కోట్లు |
పథకేతర వ్యయం | 10,00,961 కోట్లు |
మొత్తం వ్యయం | 45,03,097 కోట్లు |
రెవెన్యూ లోటు | 8,69,855 కోట్లు |
ద్రవ్య లోటు | 17,86,816 కోట్లు |
ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు, టీవిలు, స్మార్ట్ఫోన్లు మరింత తగ్గనున్నాయి. టీవీ ప్యానళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5శాతానికి తగ్గనుంది.
లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని 21 నుండి 13 శాతానికి తగ్గించనున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్ని వంటి ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతేకాకుండా రొయ్యలకు వాడే దాణా, కెపిటల్ గూడ్స్, సీడ్స్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, ఆక్వా దాణాలో వాడే చేప నూనె మరింత తగ్గనున్నాయి.
సైకిళ్లు, ఆటోమొబైల్లు, బొమ్మల రేట్లు తగ్గనున్నాయి. హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు, హైగ్లోస్ పేపర్, స్టీల్ వస్తువులు, విటమిన్లు, లెదర్లపై దిగుమతి సుంకాన్ని పెంచారు. ఇవే కాకుండా రబ్బర్, వెండి వస్తువులు, నాప్తా, ఇంపోర్టేడ్ కార్లు, సింగరేట్లు, , చిమ్నిలు ధరలు పెరగనున్నాయి.
రైల్వేలకు | 2.42 లక్షల కోట్లు (ఇది గత సంవత్సరంతో పోలీస్తే 9 రెట్లు ఎక్కువ) |
వైద్య రంగానికి | 89,155 కోట్లు |
రక్షణ రంగం | 5,93,537.64 కోట్లు |
అంతరిక్షానికి | 12,544 కోట్లు |
హోంశాఖ | 1,96,034.94 కోట్లు |
మౌలిక వసతుల ప్రాజేక్టులకు | 75 వేల కోట్లు |
ప్రధానమంత్రి ఆవాస్యోజనకు | 79వేల కోట్లు |
పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక నిధుల కింద ప్రతి సంవత్సరం | 10 వేల కోట్లు |
మత్య్స రంగానికి | 6వేల కోట్లు |
రాష్ట్రాలకు వడ్డీలేని ఋణాల పథకం కోసం | 13.7 లక్షల కోట్లు |
కర్ణాటక సాగు రంగానికి | 5,300 కోట్లు |
రోడ్డు, రహదారుల నిర్మాణానికి | 10 లక్షల కోట్లు |
విద్యుత్ రంగానికి | 37వేల కోట్లు |
పౌర సరఫరాల శాఖకు | 2.06 లక్షల కోట్లు |
గ్రామీణాభివృద్దికి | 2,38,204 కోట్లు |
వ్యవసాయం, అనుబంధ రంగాలు | 1,44,214 కోట్లు |
నేషనల్ హైడ్రోజన్ గ్రీన్మీషన్కు | 19 వేల 700 కోట్లు |
మారుమూల గిరిజన గ్రామాల అభివృద్దికి | 15వేల కోట్లు |
పౌర విమానాయణ శాఖ | 3113 కోట్లు |
క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి | 2వేల కోట్లు |
హరిత ఇందన వృద్ది | 35,000 కోట్లు |
ఆహారం, ఎరువులు, పెట్రోలియం | 5.21 లక్షల కోట్లు |
విదేశీ వ్యవహరాలు | 18,050 కోట్లు |
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ | 37,828.15 కోట్లు |
ఈవీఎంలు | 1,900 కోట్లు |
మేధో సంపత్తి | 8200 కోట్లు |
ఇండస్ట్రీయల్ కారిడార్ | 2000 కోట్లు |
విద్యారంగం | 1,12,899 కోట్లు |
సామాజిక సంక్షేమం | 55,080 కోట్లు |
ఫార్మాసూటికల్ అభివృద్ది | 1,250 కోట్లు |
ఏకలవ్య గురుకుల పాఠశాలలు | 5,943 కోట్లు |
ఈశాన్య రాష్ట్రాల మౌలిక సదుపాయాలు | 2,491 కోట్లు |
జల్జీవన్మిషన్ | 70,000 కోట్లు |
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అమృత్కాలానికి ఇది తొలిపద్దు అని వెల్లడించారు. సప్తర్షి(సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
- సమ్మిళిత వృద్ది
- చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ది చేకూరాలి.
- మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు
- సామర్థ్యాలను వెలికితీయడం
- హరిత వృద్ది
- యువ శక్తి
- ఆర్థిక రంగం బలోపేతం
- 2025-26 నాటికి ద్రవ్యలోటు 4.5%లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
➠ కేంద్ర బడ్జెట్ - 2023 లో కొత్తగా ప్రవేశపెట్టినవి :
1) ఎంఎస్ఎంఈ లు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి ఎంటిటీ డిజిలాకర్ ఏర్పాటు
2) కొత్త అవకాశాలు, వ్యాపార ఆలోచనలు, ఉపాధి కల్పన కోసం 5జీ సేవల ఆధారంగా రూపొందించే యాప్ల సృష్టికి 100 ప్రయోగ కేంద్రాల ఏర్పాటు
3) గోబర్ధన్ అనే పథకం ద్వారా వ్యర్థాల నుండి ఆదాయం సృష్టించేందుకు 500 కొత్త ప్లాంట్ల ఏర్పాటు
4) రానున్న 3 సంవత్సరాలలో రైతులు సేంద్రీయ సాగు చేసేందుకు 10వేల బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు.
5) ఇండస్ట్రీ 4.0 కు సిద్దంగా కృత్తిమ మేధ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఐవోటి, త్రిడి ప్రింటింగ్, డ్రోన్స్ వంటి సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 అనే కొత్త పథకం ప్రారంభం
6) దేశ యువత అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి 30 స్కిల్ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు
7) గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాధారిత స్టార్టప్స్ ఏర్పాటుకు అగ్రికల్చర్ యాక్కిలరేటర్ ఫండ్ ఏర్పాటు
8) పిల్లలు, చిన్నారుల కోసం డిజిటల్ లైబ్రరీలు
9) పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం కోసం భారత్ షేర్డ్ రిపాసిటరీ ఆఫ్ ఇన్స్క్రీప్షన్స్ ఏర్పాటు
10) ప్రభుత్వ ఉద్యోగులలో నైపుణ్యం పెంపొందించడం కోసం ఐగాట్ కామయోగి పథకం ప్రారంభం
11) చిత్తడి నేలల వినియోగం, జీవ వైవిద్య పరిరక్షణ, పర్యావరణ పర్యాటకం పెంపుకోసం అమృత్ ధారోహర్ పథకం ప్రారంభం
12) దేశీయ, విదేశీ పర్యాటకునుల ఆకట్టుకునేలా 50 పర్యాటక కేంద్రాల అభివృద్ది కోసం దేఖో అప్నా దేశ్ పథకం ప్రారంభం
13) భూమిని కాపాడుకునేందుకు ఎరువుల వినియోగంలో సమతుల్యం పాటించేలా పీఎం ప్రణామ్ పథకం ప్రారంభం.
14) తీర ప్రాంతాల్లో మడ అడవులను అభివృద్ది చేసేందుకు మిష్టి పథకం ప్రారంభం.


- గ్రామీణప్రాంతాలలో 9 కోట్ల నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది
- పిఎం కిసాన్ ద్వారా 11.4 కోట్ల రైతులకు 2.2 లక్షల కోట్లను వెచ్చించడం జరిగింది
- ఉజ్వల పథకం ద్వారా 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.
- 47.8 కోట్ల మందికి పిఎం జన్ధన్ ఖాతాలున్నాయి.
- 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్లో తరచూ వాడే పదాల గురించి తెలుసుకుందాం.
➠ బడ్జెట్ :
స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలియజేసే పట్టికనే బడ్జెట్గా భావించవచ్చు. ప్రజల నుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతుందో ఈ బడ్జెట్ ద్వారా తెలియజేస్తారు.
➠ మూలధన బడ్జెట్ :
మూలధన, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్లో మూలధన బడ్జెట్తో పాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్లో ఉంటాయి. ప్రభుత్వాని వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబందించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి.
➠ రెవెన్యూ పద్దు :
ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, ఋణచెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.
➠ క్యాపిటల్ పద్దు (ప్రణాళిక వ్యయం) :
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి.
➠ సంచిత నిధి :
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు ఋణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుండి ఖర్చు చేయడానికి పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు- రెవెన్యూ వ్యయం 2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం
➠ ప్రభుత్వ ఖాతా :
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. ఆర్బిఐ నుండి, పిఎఫ్ నుంచి తీసుకునే ఋణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.
➠ రెవెన్యూ వసూళ్లు :
పన్నులు, సుంకాలు ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూల్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు, ఎక్సైజ్ డ్యూటీ, కార్పోరేట్ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే డబ్బంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు ఈ కేటగిరి కిందికి వస్తాయి.
➠ రెవెన్యూ వ్యయం :
ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు.
➠ రెవెన్యూలోటు :
ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయలోటు ఏర్పడుతుంది. దీనినే రెవెన్యూ లోటు అంటారు. అప్పులు, ఇతర మార్గాల ద్వారా ఈ లోటును పూడుస్తారు.
➠ ప్రత్యక్ష పన్నులు :
ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయపన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ వంటికి ఈ కోవలోకి వస్తాయి. ఈ పన్నులను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పర్యవేక్షిస్తుంది.
➠ పరోక్ష పన్నులు :
నేరుగా మనం చెల్లించకుండా వివిధ వస్తువులు, సేవలపై ప్రభుత్వం వేసే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. జీఎస్టీ, వ్యాట్, సేల్స్ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వంటికి పరోక్ష పన్నుల కేటగిరిలోకి వస్తాయి. ఈ పన్నులు సదరు వస్తువులు, సేవలను అందించే కంపెనీల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి.
➠ సెస్లు :
మనం చెల్లించే పన్నులకు అదనంగా కొంత శాతం మేర విధించే ప్రత్యేక పన్నులు/చార్జీలను సెస్లుగా చెప్పవచ్చు. ఎడ్యూకేషన్ సెస్, కృషికళ్యాణ్ సెస్, స్వచ్ఛభారత్ సెస్, పెట్రోల్ డిజిల్పై సెస్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెస్లుగా వసూలు చేసే మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది.
➠ సర్ చార్జీలు :
అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, సేవలపై అదనంగా విధించే చార్జీలను సర్ చార్జీలు అంటారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాలు ధనిక కేటగిరిల్లోని వారు వినియోగించే ఖరీదైన వస్తువులు, సేవలపై సర్ చార్జీలను విధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు విలాసవంతమైన కార్లు, ఖరీదైన బైకులు, దిగుమతి చేసుకునే వాహనాలు వంటివి. దీనికితోడు అత్యధిక ఆదాయం ఉండేవారి నుండి వసూలు చేసే ఆదాయయ పన్నుపైనా సర్ చార్జీలు ఉన్నాయి.
➠ డిజిన్వేస్టిమెంట్ :
ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్మడం, లేదా పూర్తిగా విక్రయించడం లేదా స్టాక్మార్కెట్లో వాటిని లిస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వేస్ట్మెంట్) అంటారు.
➠ ఓటాన్అకౌంట్ :
బడ్జెట్ ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి నిడివికి సంబందించి ఉంటుంది. అనగా ఏప్రిల్ 1వ తేది నుండి వచ్చే సంవత్సరం మార్చి 31వరకు ఉంటుంది. కానీ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పదవీకాలం ఈ మద్యకాలంలో ముగిస్తే పూర్తిస్థాయి బడ్జెన్ను ప్రవేశపెట్టడం కుదరదు. సదరు ప్రభుత్వం ఉండే పదవికాలానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనినే ఓటాన్అకౌంట్ అంటారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు.
➠ శ్రీఅన్న తృణధాన్యాల హబ్ :
దేశాన్ని తృణధాన్యాల హబ్గా మార్చేందుకు శ్రీఅన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. హైద్రాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ను దీనికి ఎంపిక చేశారు. దీని ద్వారా దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైద్రాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) పరిధిలో పనిచేసేలా ఏర్పాటు చేశారు. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాలు పంటలపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి.
➠ అమృతకాల్ అంటే :
భారత దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తి చేసుకుంది. మరో 25 సంవత్సరాలు గడిస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అంటే 2021 సంవత్సరం నుండి 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం. ఈ 25 సంవత్సరాల్లో భారత నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించి అభివృద్ది చెందుతున్న దేశం నుండి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలి అని ప్రధాని నరేంద్రమోడీ వాఖ్యానించారు. ఈ 25 సంవత్సరాల కాలాన్ని అమృతకాల్గా పరిగణిస్తారు.

➠ మొదటి బడ్జెట్ :
భారతదేశంకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముగం చెట్టి తొలిబడ్జెట్ను ప్రవేశపెట్టారు.
➠ వరుసగా ఐదు సార్లు :
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన 6వ కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె బాద్యతలు చేపట్టినప్పటి నుండి ప్రవేశపెట్టిన బడ్జెట్ 5వది. ఇందుకు ముందు వరుసగా 5 అంతకన్నా ఎక్కువగా కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారిలో అరుణ్జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్సిన్హ, మన్మోమన్సింగ్, మొరార్జి దేశాయిలు ఉన్నారు. అలాగే ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలాసీతారామన్ గుర్తింపు పొందారు.
0 Comments